లక్షెట్టిపేట కేజీబీవీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట / మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన లక్షెట్టిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించి.. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతుల కల్పనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు (యూనిఫాం) అందజేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు