లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్!
గాజువాక నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థుల సత్తా… జిల్లా దృష్టిని ఆకర్షించిన ఫలితాలు!
విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోని నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈసారి పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 592 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో టాప్ స్కోర్ నమోదు చేయడంతో పాటు, పలు మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.
లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూళ్లకు గట్టి పోటీ ఇస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదే స్థాయిలో రాణించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒకటి రెండు ర్యాంకులకే పరిమితం కాకుండా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆనందోత్సవాలు నిర్వహించారు. డప్పులు, ఊరేగింపుతో పాఠశాల పరిసరాలు ఉత్సాహభరితంగా మారాయి.
ఉచిత విద్యతో పాటు మెరుగైన బోధన అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట వేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు మరోసారి తమ సత్తా చాటాయి. ప్రభుత్వ విద్యపై ఉన్న అపోహలకు ఈ ఫలితాలు గట్టి సమాధానంగా నిలిచాయి.