లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సహాయ ఇంజనీర్ (ఏఈ) పైడి సతీష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు.
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్డు పనులకు సంబంధించిన కొలతలను ఎం-బుక్లో నమోదు చేసి, పై అధికారులకు పంపేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు గురువారం నిఘా ఏర్పాటు చేసి, లంచం స్వీకరిస్తున్న సమయంలో పైడి సతీష్ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు తీసుకున్న నగదును తన ద్విచక్ర వాహనం సీటు కింద దాచిపెట్టగా, అధికారులు నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.