మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో అకాల గాలి, వర్షం బీభత్సంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని కౌలు రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు, కార్యదర్శి గద్దల రామకృష్ణ మాట్లాడుతూ ఏప్రిల్ 30న కురిసిన అకాల వర్షాల కారణంగా విస్తృతంగా మామిడి తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఎకరానికి రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు. మామిడి తోటలను కూడా పంట నష్ట పరిధిలోకి తీసుకుని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
రైతు సంఘం నాయకుడు పులిబళ్ల ఏడుకొండలు మాట్లాడుతూ, మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆలస్యం చేస్తే రైతులు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.