మామిడి రైతును ఆదుకోవాలి
మామిడి రైతును ఆదుకోవాలి – మార్క్ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేయాలి!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో అంబేద్కర్ సెంటర్ వద్ద మామిడి రైతులు ఆందోళనకు దిగారు. తాము పండించిన మామిడి పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో, కాయలను రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు సరైన ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.
మొక్కజొన్న, వరి మరియు మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. మామిడి రైతులను ఆదుకోవడానికి మార్క్ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో డీజిల్ కొరత కారణంగా రవాణా వ్యయం పెరిగి, మామిడి రైతులపై అదనపు భారం పడుతోందన్నారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల 75 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుందని, నూజివీడు మామిడి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. అయినప్పటికీ, ప్రస్తుతం గిట్టుబాటు ధరలు లేక రైతులు మామిడి తోటలను నరికి వేసే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టపోయిన రైతులకు ఎకరాకు 70 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, నూజివీడు చిన్న రసం రకానికి పేటెంట్ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మామిడి పంటను పంటల బీమా పథకంలో చేర్చాలని, మామిడి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సూచించారు.
మామిడి సీజన్లో ఉపాధి హామీ పథకాన్ని మామిడి పంటతో అనుసంధానం చేయాలని, నూజివీడు నుండి మచిలీపట్నానికి తరలించిన వ్యవసాయ కార్యాలయాన్ని తిరిగి నూజివీడులోనే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, దళారుల బారి నుంచి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు డి పుల్లారావు, వేముల బక్కయ్య, భూక్యూ హరిచంద్, పీకళావతి, భవాని, మేకల కుమారి, చాట్ల బాబూరావు, భూతం మారయ్య, పి గోవిందు, జీ మారయ్య, రామకృష్ణ, చిట్టి పాటీ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.