మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు
అనంతపురం జిల్లా గుత్తి మండలం మార్నేపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న చిన్నారి అపహరణ యత్నం ఘటనపై గుత్తి సీఐ రామారావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
గ్రామానికి చెందిన గొల్ల నారాయణస్వామి కుమారుడు హేమతేజ(2) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి బాబును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన బాలుడి తల్లి లలిత వెంటనే అప్రమత్తమై బాబును లాక్కోవడంతో, ఆ వ్యక్తి ఆమెతో పెనుగులాటకు దిగాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తిగా తేలినట్లు సీఐ రామారావు తెలిపారు. గత రెండు రోజులుగా మార్నేపల్లి క్రాస్, ఐఓసీ పెట్రోల్ బంక్ పరిసరాల్లో తిరుగుతున్నట్లు స్థానికులు, ఉపాధి హామీ కూలీలు గుర్తించినట్లు చెప్పారు.
ఈ ఘటనను కిడ్నాప్ ప్రయత్నంగా భావించాల్సిన అవసరం లేదని, మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆ వ్యక్తి అలా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. గ్రామస్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ స్పష్టం చేశారు.