మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట
మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట
“ప్రపంచ కార్మికులారా ఏకంకండి… పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప!” అనే నినాదాలతో మేడే ఉత్సాహం రాష్ట్రమంతా మార్మోగింది. ఏఐసిసిటియు ఆధ్వర్యంలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి హరినాథ్ వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు రక్తం చిందించి సాధించిన ఎనిమిది గంటల పనిదినాన్ని ఇప్పుడు పాలకులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పనివేళలను 10 గంటలకు పెంచడం, మహిళలను రాత్రి పూట పనికి బలవంతం చేయడం వంటి చర్యలు పూర్తిగా కార్మిక వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కార్మికుల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రయత్నాలు కొనసాగితే కార్మిక లోకం తిరగబడక తప్పదని హరినాథ్ హెచ్చరించారు. నోయిడాలో కార్మిక హక్కుల కోసం పోరాడిన 400 మంది కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా మేడేను విజయవంతం చేసిన కార్మికులకు హరినాథ్ అభినందనలు తెలియజేస్తూ, కార్మిక ఐక్యతతోనే హక్కులు సాధ్యమని పునరుద్ఘాటించారు.