మైక్రో ఫైనాన్స్ రుణాలకు దూరంగా ఉండండి – డిఆర్డిఏ ఏపిఎం దయాల రాజశేఖర్ సూచనలు
నెక్కలం గొల్లగూడెం గ్రామంలో ప్రశాంతి గ్రామైక్య సంఘం ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఏ ఏపిఎం దయాల రాజశేఖర్ హాజరయ్యారు. ఆగిరిపల్లి మండలంలో ఏసీఎల్పీ (అడ్వాన్స్ క్రెడిట్ లైవ్ లీహుడ్ ప్లాన్) కార్యక్రమం భాగంగా ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా దయాల రాజశేఖర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద రుణాలు తీసుకోవద్దని సూచించారు. ఈ సంస్థలు అధిక వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేయడంతో మహిళలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏసీఎల్పీ ద్వారా అనేక రుణ సదుపాయాలు అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి బ్యాంకు, ఉన్నతి పథకం, సిఐఎఫ్ పథకం, గ్రూప్ పొదుపుల ద్వారా అవసరమైన రుణాలు పొందవచ్చని చెప్పారు.
రుణాలు అవసరమైన సభ్యులు గ్రూప్ సమావేశం నిర్వహించి, అవసరాల వివరాలను నిర్ణయించి, సీసీ సహాయంతో బయోమెట్రిక్ నమోదు చేసి బ్యాంకులు లేదా స్త్రీనిధి ద్వారా రుణాలు పొందవచ్చని వివరించారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ వలయంలో చిక్కుకోకుండా, సిబిఓల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలని మహిళలకు సూచించారు.
ఇప్పటివరకు ఈ ఏడాది ఏసీఎల్పీ కింద 1047 స్వయం సహాయక సంఘాలు సుమారు రూ.75 కోట్ల రుణ అవసరాన్ని బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీసీ లక్ష్మీ, వీవోఏ విజయ, సంఘ సభ్యులు సంధ్య, ప్రసన్నతతో పాటు ఎస్ఎస్జీ మహిళలు పాల్గొన్నారు.