మధిర అభివృద్ధికి రూ.47 కోట్ల భారీ నిధులు
మడుపల్లి రోడ్డు, ఏటి బ్రిడ్జికి రూ.26 కోట్లు.. సిరిపురం–మెట్టగుట్ట డబుల్ రోడ్డుకు రూ.21 కోట్లు
జీవో విడుదల.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ నాయకుల కృతజ్ఞతలు
మధిర: మధిర నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రెండు కీలక రహదారి అభివృద్ధి పనులకు ఏకంగా రూ.47 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిధులతో మధిర పట్టణం, పరిసర ప్రాంతాల్లో రహదారి రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్ నిధుల వివరాలను వెల్లడించారు.
మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్ నుంచి శివాలయం మీదుగా ఏటి మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మడుపల్లి వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.26 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.
అదేవిధంగా సిరిపురం నుంచి మెట్టగుట్ట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.21 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ రెండు కీలక రహదారి పనులకు కలిపి రూ.47 కోట్ల నిధులు మంజూరు కావడం మధిర అభివృద్ధిలో కీలక ముందడుగుగా అభివర్ణించారు.
ప్రయాణ సమయం తగ్గే అవకాశం
మడుపల్లి రోడ్డు, ఏటి బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మధిర పట్టణానికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రహదారి విస్తరణతో ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గడంతో పాటు మధిర నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణించే ప్రజలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు.
సిరిపురం–మెట్టగుట్ట డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల నుంచి మధిరకు వచ్చే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ రెండు పనులు పూర్తయితే మధిర ప్రాంతంలో రహదారి అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల కృషి ఫలితం
మధిర అభివృద్ధికి నిధులు మంజూరు కావడంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషితో పాటు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు చేసిన అభ్యర్థనలు కీలకంగా నిలిచాయని నాయకులు తెలిపారు.
మధిర నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి భారీగా నిధులు మంజూరు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత రామనాథం, వైస్ చైర్మన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరం శెట్టి కిషోర్, పులిబండ్ల చిట్టిబాబు, కౌన్సిలర్ శ్రీపాలశెట్టి వెంకట్రావు, కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, తన్నీరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.