మధిర: యూరియా యాప్ను తొలగించాలి.. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
మధిర: యూరియా యాప్ను తొలగించాలి.. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
సిపిఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు డిమాండ్
మధిర: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా, ఇతర రసాయన ఎరువుల కొనుగోలు యాప్ విధానాన్ని వెంటనే తొలగించాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. మధిర పట్టణంలోని బోడెపూడి భవన్లో జరిగిన సిపిఎం మధిర రూరల్ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఎరువుల కొనుగోలు కోసం యాప్ విధానం అమలు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల్లో రైతుల అవసరాలకు సరిపడా యూరియా, డీఏపీ, ఇతర ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
సుదూర ప్రాంతాల నుంచి ఎరువుల బస్తాలను కొనుగోలు చేసి సొంత గ్రామాలకు, పొలాలకు తరలించడం రైతులకు భారంగా మారిందన్నారు. అన్నదాతలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిబంధనల పేరుతో మరింత ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ప్రశ్నించారు.
యాప్ విధానానికి వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మడుపల్లి గోపాలరావు హెచ్చరించారు.
మండల కమిటీ అధ్యక్షతన ఓట్ల శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, మండల కార్యదర్శి మందా సైదులు, పాపినేని రామనరసయ్య, మందడపు ఉపేందర్, రావు నాయుడు, శ్రీరాములు, గౌరారాజు, ధనలక్ష్మి, షేక్ ఉద్దండు సాహెబ్, దొంతి వీరాచారి, వడ్రానపు మధు, అంకె శివయ్య తదితరులు పాల్గొన్నారు.