మధిరలో కదంతొక్కిన మహిళలు తాత మధు అరెస్టు
మధిరలో కదంతొక్కిన మహిళలు తాత మధు అరెస్టు, మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా భారీ ర్యాలీ
మధిర: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మధిరలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తాత మధు అరెస్టు, అసెంబ్లీ వద్ద మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం మధిర పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మధిర పురవీధుల్లో మహిళలు భారీగా కదంతొక్కడంతో పట్టణంలో నిరసన వాతావరణం నెలకొంది. ప్రశ్నిస్తే అరెస్టులు.. నిరసిస్తే దాడులు.. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? అంటూ మహిళలు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల తరఫున ప్రశ్నించే హక్కును కాలరాస్తూ అరెస్టులు, దాడులకు పాల్పడటం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. మహిళా శాసనసభ్యులపై దాడి చేయడం ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించారని ఆరోపించారు.
మహిళలపై చేయి చేసుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారడం సిగ్గుచేటని అన్నారు. దీనికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వం నయవంచన పాలన సాగిస్తోందని ఆరోపించారు.
ప్రజల గొంతుకలను అణచివేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టలేరని కమల్ రాజు అన్నారు. తాత మధు అరెస్టును వెంటనే ఉపసంహరించుకోవాలని, మహిళా శాసనసభ్యులపై దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల గొంతును అణచివేయాలని చూస్తే అదే ప్రజాగ్రహం ప్రభుత్వాన్ని ప్రశ్నించే మహా ఉద్యమంగా మారుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ మండలాల మాజీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.