మధిరలో మెగా లోక్ అదాలత్ విజయవంతానికి సన్నాహాలు..
మధిరలో మెగా లోక్ అదాలత్ విజయవంతానికి సన్నాహాలు.. న్యాయమూర్తి దీప్తి వేముల ఆధ్వర్యంలో సమావేశం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర:
మధిర కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మధిర కోర్టు న్యాయమూర్తి దీప్తి వేముల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పెండింగ్లో ఉన్న కేసుల్లో రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, ఇరుపక్షాల అంగీకారంతో వివాదాలను త్వరితగతిన పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి దీప్తి వేముల మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా, త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు.
మెగా లోక్ అదాలత్లో సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు తదితర రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో వైరా ఏసీపీ ఎస్. సారంగపాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రామరాజు, వాసంశెట్టి కోటేశ్వరరావు, జ్ఞానేష్, ఏపీపీ జన్ను భద్రయ్య, మాధురితో పాటు కోర్టు సిబ్బంది, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు. మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు.
ప్రజలు, కక్షిదారులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని తమ పెండింగ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి దీప్తి వేముల విజ్ఞప్తి చేశారు.