మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ సాగర్ నాయుడు గారు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, వేధింపులు, మోసాలు తదితర సమస్యలను ఎస్పీ గారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులు తమ సమస్యలను స్వేచ్ఛగా వివరించేలా వారికి భరోసా కల్పిస్తూ, వారి ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించారు.
ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం మరింత పెరిగేలా ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, చట్టపరమైన పరిష్కారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.
*ఈరోజు మీకోసం కార్యక్రమానికి మొత్తం 56 ఫిర్యాదులు రాగా అందులో..*
▪️పమిడిముక్కల నుండి నరసయ్య అనే వృద్ధుడు వచ్చి తనకు ఇద్దరు కుమారులు కలరని ఆస్తి పంపకాలు జరపడం లేదని వృద్ధ దంపతులమైన మమ్ములను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు.
▪️చల్లపల్లి నుండి ప్రమీల అనే మహిళ వచ్చి తన కుటుంబ అవసరాల నిమిత్తం దగ్గర బంధువుల నుండి కొంత మొత్తం అప్పుగా తీసుకోవడం జరిగిందని ఇప్పటికే వడ్డీ, అసలు చెల్లించినప్పటికీ చెల్లించలేదని అబద్ధ సాక్ష్యాలు సృష్టించి ఇబ్బంది పెడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు.
▪️ఘంటసాల నుండి పద్మ అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి రెండు సంవత్సరాలవుతుందని పిల్లల పుట్టలేదనే కారణంతో భర్త అత్తింటి వారు వేధింపులకు గురి చేయడమే గాక తన భర్తకు మరొక వివాహం చేయాలని చూస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు.