గంజాయి నిర్మూలనకు ఎన్టీఆర్ పోలీసుల వినూత్న చర్యలు.. మాట్రిస్ 4టీ డ్రోన్లతో అవగాహన
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిని మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మాట్రిస్ 4టీ డ్రోన్లను రంగంలోకి దించారు.
పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ‘డ్రగ్స్పై దండయాత్ర-1.0’, ‘అవగాహన అనంతరం కార్యాచరణ-2.0’, ‘మార్పుకు మరో అవకాశం’ వంటి కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. నగరంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
గంజాయి సంస్కృతి, బ్లేడ్ బ్యాచ్ల భయాన్ని తొలగించేందుకు పోలీసులు ‘ఈగల్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాదకద్రవ్యాల విక్రేతలు, వినియోగదారులపై కచ్చితమైన సమాచారం అందించే వారికి నగదు బహుమతులు ప్రకటించారు.
గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు విక్రయించే వారి సమాచారం అందిస్తే రూ.5 వేల నగదు బహుమతి, వినియోగదారుల సమాచారం అందిస్తే రూ.1,500 బహుమతి అందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, జనసమ్మర్థ ప్రదేశాల్లో మాట్రిస్ 4టీ డ్రోన్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక లౌడ్స్పీకర్ సదుపాయం కలిగిన ఈ డ్రోన్ ద్వారా ఈగల్ ఛాలెంజ్ వివరాలను శబ్ద రూపంలో ప్రజలకు చేరవేస్తున్నారు.
అంతేకాకుండా నగర భద్రతపై గగనతలం నుంచి నిఘా కొనసాగించేందుకు, పరిస్థితులను సమీక్షించేందుకు ఈ అధునాతన డ్రోన్లు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అధికారులు తెలిపారు.