మెరిట్ ఆధారంగానే ప్రీ-ప్రైమరీ ఉద్యోగాల భర్తీ..సిఫార్సులకు తావులేదు, అధికారుల స్పష్టత..
నిజామాబాద్ (డొంకేశ్వర్):ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రీ-ప్రైమరీ విభాగాల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామక ప్రక్రియ అత్యంత నిష్పాక్షికంగా సాగుతోంది ఈ ఉద్యోగాల భర్తీపై అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియ అంతా పూర్తిగా పారదర్శకంగా, కేవలం అర్హత మార్కులు (మెరిట్), స్థానికత మరియు ప్రభుత్వ రోస్టర్ నిబంధనల ప్రకారమే జరుగుతుందని వెల్లడించారు.ఈ నియామకాల్లో ఎలాంటి రాజకీయ లేదా ఇతర సిఫార్సులు చెల్లవని, ఎవరైనా దళారులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఒక పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున 1:3 నిష్పత్తితో ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేసి నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు.ప్రొవిజినల్ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిందని ఎలాంటి సిఫార్సులు, అక్రమాలకు తావులేకుండా కేవలం ప్రతిభ, స్థానికత ఆధారంగానే ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను (Final Selection List) త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పడిన ప్రత్యేక కమిటీల పర్యవేక్షణలోనే నిష్పాక్షికంగా జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ పారదర్శక నియామకాల ద్వారా అర్హులైన పేద, మధ్యతరగతి మహిళలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోంది. అలాగే, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నమ్మకమైన అభ్యర్థులు ఎంపిక అవుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రీ-ప్రైమరీ చిన్నారులకు నాణ్యమైన సంరక్షణ, విద్య అందుతుందని విద్యాశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.