మహానాడులో నూజివీడు సత్తా.. రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించాం: మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు, మహానాడులో నూజివీడు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించారని, ఇందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
నూజివీడులో నిర్వహించిన బూత్ లెవల్, క్లస్టర్ ఇన్చార్జిల ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కీలకమని చెప్పారు. దొంగ ఓట్లు, ద్వంద్వ ఓట్లు తొలగించి, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియ జూలై 15 వరకు కొనసాగుతుందని వివరించారు.
మహానాడులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది కార్యకర్తలు పాల్గొనడం తెలుగుదేశం పార్టీ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే 2029 ఎన్నికల్లోనూ విజయాన్ని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ, ప్రజలు ఇచ్చిన ఓట్లతో ఎన్నికైన నాయకులు అసెంబ్లీకి హాజరుకాకపోవడమే నిజమైన వెన్నుపోటు అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం సూపర్-6 హామీల అమలులో ముందంజలో ఉందని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, సంక్షేమంతో పాటు అభివృద్ధికీ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.325 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.14 కోట్ల సహాయం అందించామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, బూత్-క్లస్టర్ ఇన్చార్జులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.