మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్
మదనపల్లి మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, వారిపై జరిగే నేరాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు పడేలా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా "ఆపరేషన్ దండాయన" కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'స్పీడ్ ట్రయల్ మానిటరింగ్' విధానాన్ని జిల్లాలో వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.
మహిళలపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం 'జీరో టాలరెన్స్ విధానం' అవలంబిస్తోందని, నిందితులు ఎంతటి ప్రభావశీలురైనా చట్టం ముందు లొంగాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లాలో మహిళలపై నేరాలలో 16 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టం ద్వారా విచారణలో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పునరావృత నేరస్థులపై సెక్సువల్ అఫెండర్ షీట్లు' (SOS) తెరిచి, జియో ట్యాగింగ్ ద్వారా వారి కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలపై జరిగిన నేరాల్లో కోర్టులు విధించిన కఠినమైన తీర్పుల వివరాలను పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.