పెనుగొలనులో గరిమెళ్ల సత్యనారాయణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గరిమెళ్ల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఆయన రచించిన "మాకొద్దీ తెల్లదొరతనం" గీతం స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తిని రగిలించి, సత్యాగ్రహ ఉద్యమానికి అపారమైన స్ఫూర్తిని అందించిందని పేర్కొన్నారు. అలాగే "దండాలు దండాలు భారతమాత" వంటి గేయాలు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయని చెప్పారు.
దేశభక్తి గేయాలు, ఖండకావ్యాలు, నాటకాలు, భక్తిగీతాలు, బాలగీతాలు, గాంధీ గీతాలు, స్వరాజ్య గీతాల ద్వారా గరిమెళ్ల సత్యనారాయణ ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించి చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శీలం కృష్ణారెడ్డి, దేవర అంజలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.