మహిళలు, చిన్నారుల రక్షణే ప్రాధాన్యత
మహిళలు, చిన్నారుల రక్షణే ప్రాధాన్యత: ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి, మే 2: మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. వారి రక్షణ కోసం పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రతి మహిళ మొబైల్లో ‘శక్తి’ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే వెంటనే పోలీస్ నియంత్రణ గదికి సమాచారం చేరి, సమీపంలోని పెట్రోలింగ్ బృందం సహాయం అందిస్తుందని చెప్పారు.
రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో అపరిచితుల వాహనాల్లో ప్రయాణించవద్దని హెచ్చరించారు. ఆటో లేదా క్యాబ్ ఎక్కినప్పుడు వాహనం నంబర్ను కుటుంబ సభ్యులకు పంపించడం అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
పరిచయం లేని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కళాశాలలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం శక్తి బృందాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయని తెలిపారు. వేధింపులకు గురైతే మౌనం పాటించకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ‘మంచి స్పర్శ – చెడు స్పర్శ’పై అవగాహన కల్పించాలని కోరారు. చిన్నారులపై జరిగే వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోక్సో చట్టం కింద నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
మహిళలు తమను ఒంటరిగా భావించవద్దని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. వారి రక్షణ బాధ్యత పోలీసులదేనని, ఏ సమస్య వచ్చినా నిర్భయంగా సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.