మంచిర్యాల - హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మించాలి
మంచిర్యాల - హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మించాలి
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి వినతి
మంచిర్యాల - హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల - కరీంనగర్ - హైదరాబాద్ మధ్య మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన కోసం ఈ ప్రాజెక్టు అత్యంత ఆవశ్యకమని ఆయన మంత్రికి వివరించారు.
తగ్గనున్న రాజీవ్ రహదారి ట్రాఫిక్ కష్టాలు
ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రఘునాథ్ వెరబెల్లి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విద్యా, వైద్యం, వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు కరీంనగర్, హైదరాబాద్లకు రాకపోకలు సాగిస్తున్నారని, వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి నూతన రహదారి నిర్మాణం తక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.
3 గంటల్లోనే హైదరాబాద్కు ప్రయాణం
కేంద్రం చేపట్టనున్న 'నాగపూర్ - హైదరాబాద్ నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి' నిర్మాణాన్ని మంచిర్యాల మీదుగా చేపడితే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 5 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం 3 గంటల లోపు తగ్గుతుందని, అలాగే సరుకు రవాణా కూడా మరింత వేగవంతంగా జరుగుతుందని వివరించారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఈ జాతీయ రహదారిని మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆయన కోరారు