మంచిర్యాల జిల్లాను 100 శాతం అక్షరాస్యత సాధించేలా తీర్చిదిద్దాలి
విజయవంతంగా ముగిసిన అక్షర వాలంటీర్ల 100 రోజుల కుట్టు శిక్షణ
ఉత్తీర్ణులకు త్వరలో సర్టిఫికెట్ల ప్రదానం
అందరికీ విద్య – అందరిది బాధ్యత అని అధికారుల పిలుపు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఐడీఓసీ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో అక్షర వాలంటీర్లకు నిర్వహించిన 100 రోజుల కుట్టు శిక్షణ కార్యక్రమం శుక్రవారం (తేది. 12/06/2026) విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అక్షర వాలంటీర్లకు నిర్వాహకులు పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ త్వరలోనే సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి చందుర్తి మహేందర్, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, డీఆర్పీలతో పాటు అక్షర వాలంటీర్లు విశేషంగా పాల్గొన్నారు.
ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ వయోజన విద్య ఉపసంచాలకులు ఏ. పురుషోత్తం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చాతరాజుల దుర్గాప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ అక్షర వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి అక్షర వాలంటీరు 15 నుండి 60 సంవత్సరాల వయస్సు గల నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదవడం, రాయడంతో పాటు ప్రాథమిక గణిత నైపుణ్యాలను నేర్పించే బాధ్యతను స్వీకరించాలని సూచించారు. "అందరికీ విద్య – అందరిది బాధ్యత" అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని, వాలంటీర్లందరూ అంకితభావంతో పనిచేసి మంచిర్యాల జిల్లాను 100 శాతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు