రేపు జిల్లాకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క: ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్
గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి, మినీ లిఫ్ట్ ఇరిగేషన్కు శంకుస్థాపన
సింగరేణి ఉద్యోగుల వారసులకు నియామక పత్రాల పంపిణీ, ఓపెన్ కాస్ట్ గనుల పరిశీలన
శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు, ప్రజాప్రతినిధులు
NTODAY NEWS మంచిర్యాల, జూన్ 12: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం (జూన్ 13) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం ఆయన దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని డీసీపీ ఎ. భాస్కర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గిరిజన సహకార అభివృద్ధి సంస్థ (జీసీసీ) చైర్మన్ కొట్నాక తిరుపతిలతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా గూడెం ఆలయ పునర్నిర్మాణ పనులకు, అలాగే మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపనలు జరగనున్నాయని వెల్లడించారు.
ఆ తర్వాత మంచిర్యాల పట్టణంలో నిర్వహించనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో సింగరేణి సంస్థలో వైద్య పరంగా విధులు నిర్వహించలేని ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను అందజేస్తారని తెలిపారు. సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలిస్తారని, అనంతరం మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో భద్రత, వసతుల ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంచిర్యాల వేంపల్లి ప్రాంతంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ ఏర్పాట్లను డీసీపీ, ఎమ్మెల్యే, ఏసీపీ ప్రకాష్లతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. తదనంతరం పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్ను సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ (జిఎం) తో కలిసి సందర్శించి, సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎంపీడీఓ ప్రసాద్, లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్, ఆలయ ఈవో శ్రీనివాస్లతో పాటు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు