సారంగపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని పురుషుడి అస్థిపంజరం లభ్యమవ్వడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సారంగపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి కేశవగేని బాలయ్య శుక్రవారం ఉదయం మేకలను మేపేందుకు అడవిలోకి వెళ్లగా, పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిన మృతదేహాన్ని గుర్తించాడు. మృతదేహం సమీపంలో లేత నీలం రంగు ప్యాంటు, బెల్టు కనిపించినట్లు సమాచారం. అడవి జంతువులు మృతదేహాన్ని తినివేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
వెంటనే బాలయ్య ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలి రాములుకు తెలియజేయగా, సర్పంచ్తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ తల భాగం, చేతులు, కాళ్ల ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మృతికి గల కారణాలు ఏమిటనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
సమాచారం అందుకున్న క్లూస్ టీమ్, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అడవిలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.