మధిరలో విద్యార్థుల కోసం బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టిన భట్టి విక్రమార్క
మధిరలో విద్యార్థుల కోసం బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టిన భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా మధిరలో విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను ప్రారంభించి పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, "పుట్టిన ఏ బిడ్డా ఆకలితో పాఠశాలకు వెళ్లకూడదు" అనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు అని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వారి విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా పరిశుభ్రమైన, నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు ఒకే సమయంలో వేడివేడిగా అల్పాహారం అందించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్ షెడ్లు నిర్మించి పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.
హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో ఆధునిక యాంత్రిక కిచెన్లు ఏర్పాటు చేశామని, మధిర సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక వాహనాల ద్వారా అల్పాహారం సరఫరా చేస్తామని వివరించారు.
ఉచిత సంక్షేమ పథకాలపై విమర్శలు చేసే వారికి సమాధానంగా, పరిశ్రమలు, ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టినట్టే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస్, వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్, కలెక్టర్ టి.ఎస్. దివాకర్, కార్పొరేషన్ చైర్మన్లు పి. దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.