పెనుగొలనులో భూదాన ఉద్యమ పితామహుడు వినోబా భావే జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం భూదాన ఉద్యమ పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినోబా భావే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ 1895 సెప్టెంబర్ 11న మహారాష్ట్రలో జన్మించిన వినోబా భావే దేశ స్వాతంత్ర్య సాధన కోసం వ్యక్తిగత సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఐదేళ్లకు పైగా జైలు జీవితం గడిపారని వివరించారు.
స్వాతంత్ర్యం అనంతరం భూమిలేని పేదలకు భూమి అందించాలనే లక్ష్యంతో 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లి గ్రామం నుంచి భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా 44 లక్షల ఎకరాలకు పైగా భూమిని సేకరించి భూమిలేని పేదలకు పంచేందుకు కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్తగా వినోబా భావే చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు.
వినోబా భావే 1982 నవంబర్ 15న మరణించారని, సమాజానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ 1983లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను మరణానంతరం ప్రదానం చేసినట్లు వక్తలు గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ, సాయిబాబా సేవా కమిటీ సభ్యులు దాములూరి సతీష్ శర్మ, వూటుకూరు యజ్ఞ కృష్ణ, మహిళా కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.