గూడెం గుట్టకు మహర్దశ.. రూ. 58 కోట్లతో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.58 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా గూడెం గుట్టపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రేపు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నట్లు తెలిపారు.
గోదావరి పుష్కరాల దృష్ట్యా గూడెం దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని, రూ.58 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణం, స్నాన ఘట్టాలు, తాగునీటి సదుపాయాలు, వసతి గృహాలు, క్యూలైన్లు, దేవాలయ సుందరీకరణ, యాత్రికులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గూడెం దేవాలయ అభివృద్ధి పూర్తయితే ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయ ఈఓ శ్రీనివాస్, డీసీపీ ఎగ్గిడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.