మంచిర్యాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో, పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించారు.
హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రీకృత వంటశాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.
అత్యాధునిక సాంకేతికత, పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు.
ఈ సందర్భంగా పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అల్పాహారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యపై సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు. ఏ విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ముఖ్యమని అన్నారు. మానవ వనరులే రాష్ట్రానికి ప్రధాన సంపదని, విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించిన హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు, సింగరేణి సంస్థ అధికారులు, డీసీపీ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.