మంచిర్యాలలో అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ రూ.50 లక్షల మంజూరు
మంచిర్యాలలో అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ వంశీ మరో రూ.50 లక్షల మంజూరు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ వంశీ మరో రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో భవన నిర్మాణానికి మొత్తం రూ.1 కోటి నిధులు అందినట్లైంది.
లైన్స్ క్లబ్ సమీపంలోని 100 ఫీట్ రోడ్డులో నిర్మిస్తున్న ఈ భవనానికి గతంలో ఎంపీ నిధుల కింద రూ.50 లక్షలు మంజూరు కాగా, భవన నిర్మాణ పనుల పురోగతిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
అంబేద్కర్ నేతకాని భవన్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు దుర్గం స్వామి మాట్లాడుతూ, ఎంపీ వంశీ నేతకాని జాతికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదనపు నిధులతో భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని, త్వరలోనే భవనం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేతకాని సమాజ అభివృద్ధికి ఎంపీ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు.
నిధుల మంజూరుతో నేతకాని సమాజంలో ఆనందం వ్యక్తమవుతోంది. భవనం పూర్తయిన అనంతరం సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు