అయోధ్య’పై నబీన్ మాట్లాడరేం?
రామమందిర హుండీ కానుకల దోపిడీపై ఎందుకు స్పందించలేదు? : మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ విమర్శించారు. అయోధ్య రామమందిరంలో హుండీ కానుకల దోపిడీ వ్యవహారంపై నబీన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
గాంధీభవన్లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రస్తుతం దేశ ప్రజలు ‘బీజేపీ ముక్త్ భారత్’ను కోరుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించలేదని పేర్కొన్నారు.
కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరిస్తారని చెప్పారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులను తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంటే, కేంద్రం కొత్త పథకాల పేరుతో అదనపు భారం మోపడం సరికాదన్నారు.
మూసీ ఆధునికీకరణ తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7 వేల కోట్లు మాత్రమేనని, అందులో లక్షల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని, అందుకే పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నిపుణులతో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు.
భగవంతుడి దగ్గర ప్రాంతాల భేదం ఉండదని, టీటీడీ పాలకమండలిలో తెలంగాణకు చెందిన వ్యక్తులు లేరా? అని ప్రశ్నించారు. ధర్మకర్తల మండలి నియామకంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని, ఈ అంశంపై ఆయనతో పాటు ముఖ్యమంత్రితోనూ మాట్లాడతానని చెప్పారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, ప్రతి విషయంలో అందరినీ భాగస్వాములను చేయడం సాధ్యం కాదని మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు.