మంచిర్యాలలో బీజేపీ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీలలో జిల్లా స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు రాజకీయ, సంస్థాగత అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని సుచిత్ర ఇన్ కన్వెన్షన్లో జరగనున్న ఈ శిక్షణా తరగతులకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమగ్ర అవగాహన కల్పించేలా రూపొందించినట్లు తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో మొత్తం 12 విభాగాలను ఏర్పాటు చేసి, ప్రతి విభాగంలో పార్టీకి సంబంధించిన కీలకమైన 12 అంశాలపై లోతైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చా గోష్టులు నిర్వహించనున్నారని చెప్పారు.
పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయని జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమ విజయవంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా నాయకత్వం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.