మంచిర్యాలలో దారుణం: మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపిన వలస కూలీలు
మంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దీపక్ అనే వలస కూలీ, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మంచిర్యాలలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వీరంతా కలిసి మద్యం సేవించిన సమయంలో వారి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మిగిలిన ఇద్దరు వ్యక్తులు దీపక్ పై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు.
తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న దీపక్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దీపక్ మృతి చెందినట్లు సీఐ ప్రమోద్ రావు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.