మండలంలో ప్రతిభ చాటిన అనన్య విద్యార్థినులకు షైనింగ్ స్టార్స్ అవార్డు
మండలంలో ప్రతిభ చాటిన అనన్య విద్యార్థినులకు 'షైనింగ్ స్టార్స్' అవార్డు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'షైనింగ్ స్టార్స్' అవార్డుకు అనన్య స్కూల్, ధర్మాజీగూడెం విద్యార్థినులు ఎంపికై మరోసారి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో కడియాల వీక్షిత 586 మార్కులు సాధించి మండలంలో ద్వితీయ స్థానం దక్కించుకోగా, నిడిగొండ గీతామాధురి 581 మార్కులతో విశిష్ట ప్రతిభ కనబరిచింది. వీరి అత్యుత్తమ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా ఏలూరులోని సి.ఆర్. రెడ్డి కళాశాలలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) చేతుల మీదుగా విద్యార్థినులు అవార్డులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అనన్య పాఠశాల డైరెక్టర్ బొల్లినేని రాంబాబు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థినులను అభినందించారు.
విద్యార్థినుల ఈ ఘన విజయం పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచిందని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.