మంగళగిరిలో ఆధునిక మోడల్ రైతు బజార్కు శ్రీకారం....
మంగళగిరిలో ఆధునిక మోడల్ రైతు బజార్కు శ్రీకారం.. రూ.18 కోట్లతో నిర్మాణం
మంగళగిరి: ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ రైతు బజార్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో ఈ ప్రతిష్టాత్మక మార్కెట్ను ఏర్పాటు చేయనున్నారు.
అరబిందో ఫార్మా ట్రస్ట్ సామాజిక బాధ్యత నిధులు రూ.18 కోట్లతో 5.90 ఎకరాల విస్తీర్ణంలో రైతు బజార్ నిర్మాణం చేపట్టనున్నారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు అనువైన వేదికగా దీనిని తీర్చిదిద్దనున్నారు.
మార్కెట్లో ప్రత్యేక దుకాణాలు, కోల్డ్ స్టోరేజీ సదుపాయం, వాహనాల పార్కింగ్, వినియోగదారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన తాజా ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ మోడల్ రైతు బజార్ను అభివృద్ధి చేయనున్నారు.