మంత్రి కొండ సురేఖ ఇంటి ముట్టడి.. హనుమకొండలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తం
హనుమకొండ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్ నుంచి రాంనగర్లోని మంత్రి కొండ సురేఖ నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు, మంత్రి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.
మంత్రి నివాసం వద్ద పోలీసులు భారీగా బారికేడ్లు, కేట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆగ్రహంతో ఉన్న కార్మికులు వాటిని తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. అనంతరం మంత్రి ఇంటి గేటు ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు.
కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కార్మికుల ఆందోళనతో మంత్రి నివాసం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.