తెలంగాణలో ఇసుక లోడింగ్ బంద్.. 35 క్వారీల్లో కార్యకలాపాలు నిలిపివేత
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో బుధవారం నుంచి లోడింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 18 ఇసుక క్వారీల్లో కూడా లోడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది.
డీజిల్ ధరలు భారీగా పెరగడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, ప్రస్తుత పరిస్థితుల్లో క్వారీల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు చెల్లించాల్సిన సుమారు రూ.300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించి బకాయిల చెల్లింపుతో పాటు ఇసుక క్వారీల నిర్వహణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. ఇసుక లోడింగ్ బంద్ కారణంగా నిర్మాణ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.