నేటి నుంచి తెలంగాణలో ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్, జులై 1: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు జులై నెలకు సంబంధించిన ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు చెందిన సుమారు 3.41 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి జాప్యం లేకుండా బియ్యం పంపిణీ చేపట్టేందుకు పౌరసరఫరాల శాఖ ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసింది. జులై నెల అవసరాలకు అనుగుణంగా మొత్తం 2.15 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాలకు తరలించింది.
లబ్ధిదారులు రేషన్ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా గ్రామాలు, వార్డుల స్థాయిలోని రేషన్ దుకాణాలకు ముందుగానే బఫర్ స్టాక్ను చేరవేశారు. దీంతో నెల మొదటి రోజు నుంచే కార్డుదారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా తమకు కేటాయించిన బియ్యాన్ని పొందే అవకాశం ఏర్పడింది.
ఇదిలా ఉండగా, యాసంగి సీజన్లో భారీ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరగడంతో ప్రభుత్వ గోదాముల్లో నిల్వ సామర్థ్యం, స్థల లభ్యత సమస్యలు తలెత్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్ నెలలోనే మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన 6.43 లక్షల టన్నుల కోటాలో రికార్డు స్థాయిలో 95 శాతం మేరకు అంటే 6.08 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు, అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు చేపట్టింది. బియ్యం పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు.