మర్రిబందం, మంగపేట గ్రామాల్లో అంగన్వాడీల ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
మర్రిబందం, మంగపేట గ్రామాల్లో పౌష్టికాహారంపై అవగాహన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం మర్రిబందం, మంగపేట గ్రామాల్లో పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంగన్వాడీ పర్యవేక్షకురాలు గాయత్రీ దేవి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదలకు ఎంతో కీలకమని తెలిపారు. సమతుల్య ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు వయసుకు తగిన పౌష్టికాహారం అందిస్తూ వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రులు సహకరించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల బరువు, ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోషకాహార లోపాలు గుర్తించినప్పుడు వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మంగపేట గణేష్, మర్రిబందం సీతాజ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు అనిత, వరలక్ష్మి, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు పాల్గొన్నారు.