వినాయక చవితి ఉత్సవాలపై అవగాహన సమావేశం మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి
తిరువూరు: వినాయక చవితి ఉత్సవాలు, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల నిర్వాహకులు, ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్సై వై.వి. శాతకర్ణి, పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ముందస్తుగా అనుమతులు పొందాలని సూచించారు. ఉత్సవాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాలను సంబంధిత శాఖల అధికారుల సూచనలు, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు.
మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అగ్నిమాపక భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఊరేగింపుల సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అధిక శబ్దంతో కూడిన శబ్ద పరికరాలు, నిషేధిత శబ్ద పరికరాలను వినియోగించరాదని తెలిపారు. నిమజ్జనం సమయంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు.
అధికారుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే సంబంధిత శాఖల అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.