తిరువూరు: ఘనంగా స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరువూరు మండల పరిధిలోని సహకార సంఘాల సిబ్బంది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టారు.
తిరువూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజుపేటలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిబ్బంది స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పారిశుద్ధ్యాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛమైన పరిసరాలు, పచ్చదనం, పరిశుభ్రమైన జీవన విధానం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లినేని రఘురామ్, గద్దె ప్రసాద్, తిరువూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి పుణ్యం మురళి, ముసునూరు సహకార సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.ఆర్.ఎస్. ప్రసాద్, వావిలాల, చింతలపాడు, మునుకుళ్ల సహకార సంఘాల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.