మతోన్మాద, ఫాసిస్టు శక్తులను ఎదిరించడమే చారు మజుందార్కు నిజమైన నివాళి: హరినాథ్
మతోన్మాద, ఫాసిస్టు శక్తులను ఎదిరించడమే చారు మజుందార్కు నిజమైన నివాళి: హరినాథ్
గుడివాడ, జూలై 28: మతోన్మాద, ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవడమే అమరజీవి కామ్రేడ్ చారు మజుందార్కు నిజమైన నివాళి అని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ పేర్కొన్నారు.
గుడివాడలో కామ్రేడ్ ఆర్. కళ్యాణి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సభలో సొంటి నాగేశ్వరరావు నిర్మించిన కామ్రేడ్ చారు మజుందార్ స్థూపం వద్ద నివాళులర్పించి ఆయన ప్రసంగించారు. ప్రజా ఉద్యమాలపై పోలీసు నిర్బంధం అంతమవ్వాలని, మార్క్సిజం–లెనినిజం, మావో ఆలోచనా విధానం వర్ధిల్లాలని నినదించారు. అమరుల ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటామని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన చారిత్రకమైందని హరినాథ్ అన్నారు. నీట్ పరీక్ష కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగించడం వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు దేశ విదేశాల్లో బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలనలో జరిగిన జలియన్వాలాబాగ్ ఘటనను ప్రస్తావిస్తూ, ఇటీవల ఢిల్లీలో జంతర్మంతర్ నుంచి పార్లమెంట్ వరకు చేపట్టిన ర్యాలీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, భాష్పవాయు ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా 23 రోజుల నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమానికి నాయకత్వం వహించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన దీక్షలు కూడా ఉద్యమంపై ప్రభావం చూపాయని అన్నారు. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించడం అభినందనీయమన్నారు.
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీహార్లో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయకపోతే ఈ నెల 30 నుంచి తిరిగి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని "కాక్రోచ్ జనతా పార్టీ" పిలుపునిచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తలెత్తే పరిణామాలకు అదే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దుర్గం పుల్లారావు, మాచవరపు ఈశ్వర్, వేముల బక్కయ్య, చాట్ల బాబురావు, పరికల కళావతి, బండారు వెంకటేశ్వరరావు, హిమావతి, మేకల కుమారి, దుర్గం పూజిత, వెంకట్రాజు మణిమిత్ర, సాయిధ, భవాని, మారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.