నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల (నస్పూర్): గ్రామస్థాయి నుంచే అభివృద్ధికి బాటలు వేసేలా అత్యుత్తమ, నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (ఐడీవోసీ) భవన సమావేశ మందిరంలో గ్రామ అభివృద్ధి ప్రణాళికపై డివిజనల్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ గణపతిలతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యుత్తమ ర్యాంకింగ్స్ సాధించే దిశగా పక్కా ప్రణాళికలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణ ద్వారా 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, పెసా గ్రామపంచాయతీలు, సభాసర్, నిర్ణయ్ యాప్, ఈ-గ్రామ స్వరాజ్ వంటి కీలక అంశాలపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు.
పంచాయతీ కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరుకావాలని, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని, గ్రామసభలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు పన్నులు సకాలంలో వసూలు చేయాలన్నారు. సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు వెంటనే అనువైన స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, అలాగే నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా, దోమల వృద్ధిని అరికట్టేలా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామాలను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దేందుకు అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సి.జి.జి. కన్సల్టెంట్ మహేష్, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు