విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ చర్యలు
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన
మంచిర్యాల/చెన్నూరు: రాష్ట్రంలో విద్యాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన చెన్నూరు మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల-కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలల్లో చేపట్టిన భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సకల సదుపాయాలు అందించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆయన సూచించారు.
అనంతరం సోమనపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులతో పాటు అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో వి.ఓ. భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఆయన.. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, మంజూరైన పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. అలాగే చెన్నూర్ పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద నిర్మిస్తున్న నీటి ట్యాంకు పనులను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించి, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్ అలీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు