పాఠశాలల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
భీమిని కేజీబీవీ, జెడ్పీ పాఠశాలల తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం
మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశం
భీమిని: ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన భీమిని మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న భోజనశాల నిర్మాణ పనులతో పాటు తరగతి గదులు, స్టోర్ రూమ్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత ఏఈని ఆదేశించడంతో పాటు.. భవనానికి వెంటనే పెయింటింగ్ వేయించాలని, ఆర్ఓ (RO) ప్లాంట్కు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఇదే క్రమంలో.. పాఠశాలకు మంజూరైన బాలికల మూత్రశాల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసి, ప్రభుత్వ మెనూ ప్రకారం సకాలంలో వారికి పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బికార్న దాస్, ఎంపీడీఓ బి.గంగామోహన్, ఎంపీఓ మహేష్, ఎంఈఓ వెంకటస్వామి, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు