నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలి –చాట్రాయి ఎంఈఓ-2 వి ఎస్ వి బ్రహ్మాచారి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి, జూన్ 3: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం రుచికరంగా, శుచిగా, పోషక విలువలతో కూడినదిగా ఉండేలా వంట ఏజెన్సీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చాట్రాయి మండల ఎంఈఓ-2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి సూచించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చాట్రాయిలో మండల పరిధిలోని 61 పాఠశాలల వంట ఏజెన్సీలకు మండల స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మాచారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. అందువల్ల వంట సిబ్బంది మధ్యాహ్న భోజన తయారీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, ప్రతి విద్యార్థికి ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందించాలని కోరారు.
కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పాటిస్తూ వంటలు సిద్ధం చేయాలని, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. భోజనం తయారీ సమయంలో పోషక విలువలు తగ్గిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా రిసోర్స్ పర్సన్ రాణి (ఆగిరిపల్లి) సవివరంగా అవగాహన కల్పించారు.
శిక్షణా కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజన మెనూ అంశాలపై సీసీహెచ్లకు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ చాట్రాయి ప్రధానోపాధ్యాయుడు డి. కృష్ణయ్య, ఉపాధ్యాయులు సీహెచ్. రఘు, ఏసుబాబు, నరసింహారావు, సీఆర్పీలు మరియు వంట ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.