నేడు ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత వాతావరణం నెలకొంది.
సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పిడుగులు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప వర్ష సమయంలో బహిరంగ ప్రదేశాల్లో సంచరించవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.