నేలతల్లిని కాపాడుదాం.. సేంద్రియ సాగుతో ఆరోగ్య భవిష్యత్తు నిర్మిద్దాం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో “ధర్తీ మాత బచావో క్యాంపెయిన్” అవగాహన కార్యక్రమం విజయవంతం
విస్సన్నపేట మండలంలోని కలగర గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “భూమాత రక్షణ కార్యక్రమం – ధర్తీ మాత బచావో క్యాంపెయిన్” ను మండల వ్యవసాయాధికారిణి జీ. రాజ్యలక్ష్మి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనకు అన్నం పెట్టే నేలతల్లిని రక్షించుకోవడం ప్రతి రైతు బాధ్యత అని తెలిపారు. అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూమి సారం తగ్గిపోతుందని, అందుకే రైతులు సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు మరియు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించాలని సూచించారు.
ఆరోగ్యవంతమైన నేల నుంచే నాణ్యమైన ఆహారం ఉత్పత్తి అవుతుందని, నేల బాగుంటే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని వివరించారు.
అదేవిధంగా సాధారణ యూరియా, డిఏపీ గుళికల బదులుగా నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. నానో ఎరువులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందిస్తాయని, పిచికారీ చేసినప్పుడు మొక్కలు ఎక్కువ శాతం పీల్చుకుంటాయని తెలిపారు.
₹366 విలువైన నానో యూరియాను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ₹249కే అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉషారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.