నేపాల్ అంతర్జాతీయ వేదికపై నూజివీడు యోగా సత్తా.. రెండు బంగారు పతకాలు కొల్లగొట్టిన ఏలూరు జిల్లా విద్యార్థులు
ఏలూరు జిల్లాలోని నూజివీడు పట్టణం మరోసారి అంతర్జాతీయ యోగా వేదికపై తన ప్రతిభను చాటుకుంది. తల్లాప్రగడ వెంకట కుమార్ కుటుంబం మూడు తరాలుగా యోగా విద్యను కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయ పరంపరను కొనసాగిస్తోంది.
ఈనెల జూన్ 7, 8, 9 తేదీల్లో నేపాల్ దేశంలోని పోఖరా నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ గేమ్స్ 2026లో నూజివీడు విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో రెండు బంగారు పతకాలు సాధించారు.
అండర్–30 విభాగంలో తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మీ యోగాసనాల్లో స్వర్ణ పతకం గెలిచి దేశానికి గౌరవం తెచ్చింది. అండర్–18 విభాగంలో ముడుంబై వి ఎల్ బి ఆర్ భావన అద్భుత నైపుణ్యంతో బంగారు పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
అంతేకాకుండా కేవలం నాలుగు సంవత్సరాల చిన్నారి రెడ్డి యోగేశ్వరి, వేదికపై చేసిన యోగాసన ప్రదర్శనతో నిర్వాహకుల ప్రశంసలు అందుకుని ప్రత్యేక సత్కారం పొందింది.
మూడు తరాలుగా యోగా సాధన కొనసాగిస్తున్న ఈ కుటుంబం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధిస్తూ నూజివీడుకు కొత్త గర్వాన్ని తెచ్చిందని స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.