నిండు జీవితానికి రెండు చుక్కలు.. పోలియో రహిత సమాజం అందరి లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని విస్సన్నపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జననం నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి కొప్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ, "ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఉన్నా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. ప్రయాణంలో ఉన్నవారికి కూడా బస్టాండ్లలో ప్రత్యేక కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసే సౌకర్యం కల్పించాం" అని తెలిపారు.
మండల వ్యాప్తంగా మొత్తం 45 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్న రత్నాలు, ఈఓ హరీకుమార్, డిప్యూటీ డీటీ విజయ భాస్కర్, హెల్త్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.