నిషేధిత పత్తి విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు – విస్సన్నపేట మండలంలో ప్రత్యేక తనిఖీలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట లో వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాలు (HT) అక్రమ అమ్మకాల నియంత్రణ కోసం ప్రత్యేక స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ ద్వారా అన్ని మండలాల్లో పర్యవేక్షణ చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు.
స్క్వాడ్లో ADA (PP) ఎ. మద్దులేటి, AO వై. శివ శంకర్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి జీ.రాజ్యలక్ష్మీ సభ్యులుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో, విస్సన్నపేట మండల పరిధిలో ఎవరైనా వ్యక్తులు లేదా విత్తన డీలర్లు నిషేధిత పత్తి విత్తనాలను నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం చేసినట్లయితే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సంబంధిత డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేయబడతాయని స్పష్టం చేశారు.
ఈ చర్యలలో భాగంగా విస్సన్నపేట పట్టణంలోని సీడ్స్ షాపుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో షాపుల రిజిస్టర్లు, స్టాక్ వివరాలు, విక్రయ పత్రాలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ADA (PP) ఎ. మద్దులేటి మాట్లాడుతూ, అనుమతులు లేని నిషేధిత పత్తి విత్తనాల అమ్మకాలు జరిపితే ఎలాంటి ఉపశమనం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులకు సూచనలు:
అనుమతి పొందిన, ధృవీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలి
విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు/రసీదు తీసుకోవాలి
అనుమానాస్పద విత్తనాలు లేదా అక్రమ అమ్మకాలపై సమాచారం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలి
నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి జీ.రాజ్యలక్ష్మీతెలియజేశారు.