నంద్యాలను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి
నాటు సారా తయారీపై కట్టుదిట్టమైన చర్యలు తప్పనిసరి
జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ
నంద్యాల జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వహించిన ఎన్కోర్డ్ (NCORD) జిల్లాస్థాయి కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా నాటు సారా తయారీ జరుగుతున్న మారుమూల గ్రామాలు, చెంచు తాండాలను గుర్తించి, ఆ కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా పాఠశాలలు, కళాశాలల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె తెలిపారు. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లల్లో మంచి అలవాట్లు, విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్లో అనుతీర్ణులైన విద్యార్థులు చెడు అలవాట్లకు గురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, వారికి ప్రత్యేక శిక్షణ అందించి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ఎక్సైజ్, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యాసంస్థల యాజమాన్య కమిటీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ యువతను రక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే నాటు సారా తయారీ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి, ఆ కుటుంబాలను అక్రమ కార్యకలాపాల నుంచి దూరం చేయాలని తెలిపారు. ముఖ్యంగా నందికొట్కూరు మండలంలోని షికారు కాలనీ వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి అక్రమ మద్యం తయారీని పూర్తిగా నివారించాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు చేపడుతోందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ మత్తు పదార్థాల విక్రయాలపై దాడులు కొనసాగిస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాలు లభ్యమవుతున్న ప్రదేశాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యాసంస్థల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పించాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్, పోలీస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీఈవో, ఐసీడీఎస్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
#APPolice